కొన్ని చోట్ల కాంగ్రెస్ మోసం చేసింది: రాఘవులు
నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ తమను మోసం చేసిందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వస్తేనే భవిష్యత్తులో కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తామని, లేదంటే తమతో కలిసి వచ్చే ఏ పార్టీతోనైనా కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఆయన గురువారంనాడు చేతివృత్తుల పనివారల చైతన్య యాత్రను ప్రారంభించారు.
రేషన్కార్డుల పంపిణీ ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. ఈ సంఘటనపై మంత్రి దివాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి కచ్చితమైన సూచనలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.