పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లను: వైయస్
హైదరాబాద్: ఈసారి కూడా పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లబోనని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ గ్రామ భేరీ కార్యక్రమాన్ని ఆయన గురువారం ఇక్కడ లాంఛనంగా ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ సరైంది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి కదా అని ఆయన అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఒకటి రెండు జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో తాము అత్యధిక జెడ్పిటిసలను కైవసం చేసుకుంటామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావని ఆయన అన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యురాలు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలకు, ప్రభుత్వం కార్యక్రమాలకు సంబంధం లేదని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలతో పొత్తు ఉంటుందని ఆయన చెప్పారు.