ప్రాజెక్టులపై ముందు దృష్టి లేదు: సిపియం
కర్నూలు: సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ముందస్తు జాగ్రత్త లేదని సిపియం కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జలయజ్ఞమంటూ పెద్ద యెత్తున ప్రచారం చేసుకుంటున్నారని, అయితే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులే లేవని ఆయన అన్నారు.
నీటి పారుదల శాఖ అధికారి శర్మను ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని, ప్రాజెక్టుల ప్రణాళికలు సరిగా లేవని నివేదికలు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు. ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతూ ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన దారి తప్పిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చరిల్లిందని, చర్యలు తీసుకునే దిక్కే లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపుతున్నాయని ఆయన విమర్శించారు.