ఇన్సూరెన్స్ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్లోని బషీర్బాగ్లో నేషనల్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎనిమిది అంతస్థుల మొఘల్కోర్టు భవనంలో మూడో అంతస్థులోని ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళ సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలను అదుపులోకి తేగలిగారు. ఈ ప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రాణనష్టమేదీ సంభవించలేదు.
పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది అతి వేగంగా చర్యలకు ఉపక్రమించారు. సంఘటనా స్థలానికి మంత్రి షబ్బీర్ అలీ, నగర పోలీసు కమీషనర్ మహంతి, నగర పాలక సంస్థ కమీషనర్ సంజయ్ జాజు, బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, జి. కిషన్ రెడ్డి వెంటనే చేరుకున్నారు. సంఘటనపై న్యాయవిచారణ జరిపిస్తామని మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. జిల్లా కలెక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. అజాగ్రత్త వల్లనే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని సంజయ్ జాజు అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తాము నోటీసులు పంపినా చాలా మంది సానుకూలంగా ప్రతిస్పందించడం లేదని ఆయన అన్నారు.