మహాజన్ కార్యదర్శి మృతి: రాహుల్ సీరియస్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత దివంగత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషాహారం తినడంతో అతను అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. రాహుల్కు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మరో 72 గంటల పాటు రాహుల్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించనున్నట్లు వైద్యులు చెప్పారు. ఇదిలావుంటే, ప్రమోద్ మహాజన్ వ్యక్తిగత కార్యదర్శి వివేక్ మొయిత్రా మృతి చెందాడు. రాహుల్తోపాటు ఆయనను కూడా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. వివేక్ చాలా కాలంగా ప్రమోద్ మహాజన్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నారు. రాహుల్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి వైద్యులు పరీక్షిస్తున్నారు.
రాహుల్ను అచేతనావస్థలో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకొచ్చారు. రక్తపుపోటు మందగించడంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా రాహుల్ ఇబ్బంది పడుతున్నాడు. సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో ప్రమోద్ మహాజన్ మరణించి నెల రోజులు కూడా గడవక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమోద్ మహాజన్కు రాహుల్ ఒక్కడే కొడుకు. బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆహ్వానం మేరకు రాహుల్ ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశంలో కూడా పాల్గొన్నారు. రాహుల్, వివేక్ మరో ముగ్గురితో పాటు గురువారం రాత్రి మహాజన్ అధికారిక నివాసంలో భోజనం చేశారు. ఈ భోజనం తర్వాతే వీరు అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో నుంచి పోలీసులు ఒక షాంపైన్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. విందుకు హాజరైన మిత్రుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సర్వెంట్ను ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల గురించి ప్రశ్నిస్తున్నారు.
ఆ ముగ్గురు వ్యక్తులు రాత్రి రెండు సార్లు వచ్చారని, వీరు రాహుల్, వివేక్లతో పాటు షాంపైన్ సేవించారని పోలీసులు అంటున్నారు. తాము ఆ ముగ్గురు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నామని, ఈ దిశలో దర్యాప్తు సాగుతుందని అదనపు పోలీసు కమీషనర్ మనీష్ అగర్వాల్ అంటున్నారు. సంఘటనా స్థలంలో పాలిథీన్ కవర్లో తెల్లటిపొడి దొరికిందని, దాన్ని రసాయనిక పరీక్ష నిమిత్తం పంపామని ఆయన చెప్పారు. విషయం తెలిసిన వెంటనే బిజెపి నాయకుడు, రాహుల్ మామ గోపీనాథ్ ముండేతో పాటు కుటుంబ సభ్యులు ఢిల్లీకి బయలుదేరి వచ్చారు. ఆహారంలో విషం కలిపి ఉంటారనే విషయాన్ని ఇప్పుడే ఏమీ చెప్పలేమని అపోలో ఆస్పత్రి అధికార ప్రతినిధి కరణ్ ఠాకూర్ అన్నారు.