నాగపూర్ మృతులు పాకిస్థాన్ దేశీయులు
నాగపూర్: ఆర్యస్యస్ కార్యాలయంపై దాడికి యత్నించిన హతమైన ముగ్గురు తీవ్రవాదులను పాకిస్థాన్ దేశానికి చెందినవారని గుర్తించినట్లు సిఐడి వర్గాలు శక్రవారంవాడు చెప్పాయి. ఇందులో అఫ్జల్ అహ్మద్ భట్, అబు అల్ కలామ్ అలద్ పాకిస్థాన్లోని లాహోర్కు చెందినవారని, మూడో తీవ్రవాది మొహమ్మద్ ఉస్మాన్ హబీబ్ పాకిస్థాన్లోని గుజ్రావాలాకు చెందినవాడని ఆ వర్గాలు చెప్పాయి.
సంఘటనా స్థలంలో లభించిన డైరీని బట్టి వారిని గుర్తించారు. వారి పేర్లు ఉర్దూలో రాసి వున్నాయని, వారి టెలిఫోన్ నెంబర్లు కూడా రాసి వున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ తీవ్రవాదులతో వారి సంబంధాలను ఇంకా ధృవీకరించాల్సి ఉందని అన్నాయి. శవాలు గానీ, సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు గానీ తమకు చేరనందున వారి గుర్తింపు గురించి తమకేమీ తెలియదని నగర పోలీసు కమీషనర్ ఎస్.పి. ఎస్. యాదవ్ అన్నారు. తీవ్రవాదులు వాడిన కారు ఎవరిదనే విషయాన్ని త్వరలోనే తెలుసుకుంటామని ఆయన చెప్పారు. కారులో 56 కిలోల పేలుడు పదార్థాలున్నట్లు ఆయన తెలిపారు.