పొత్తు లేకున్నా తెరాస కార్యకర్తలు మా వైపే: కెకె
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు లేకున్నా పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు తమకు సహకరిస్తారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. తెలుగుదేశం, బిజెపిలను ఓడించడానికి తెరాస కార్యకర్తలు కాంగ్రెస్కు సహకరిస్తారని, ఆ మేరకు తనకు హామీ కూడా ఇచ్చారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణలో తెరాస విజయం సాధిస్తే తమపై ఏ విధమైన ప్రభావం ఉండదని ఆయన అన్నారు. తెలుగుదేశం, బిజెపిలను ఓడించడానికి తెరాస తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణపై తమ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో, యుపిఎ ప్రభుత్వ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణపై తమ స్పష్టమైన వైఖరి వెల్లడించామని ఆయన వివరించారు. పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండం కాదని ఆయన అన్నారు. అయితే ఏ ఎన్నికల్లోనైనా ప్రజాభిప్రాయం వెల్లడవుతుందని, మున్సిపల్, సహకార సంఘాల ఎన్నికల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజాభిప్రాయం వెల్లడైందని ఆయన అన్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్లమెంటు సభ్యుల, శాసనసభ్యుల జోక్యం ఉండదని ఆయన చెప్పారు.