తెలంగాణపై వైఖరి చెప్పరేం?: కాంగ్రెస్కు వెంకయ్య ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణకు మద్దతుగా తాము పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల వద్ద గుర్తు చేశారు. తెలంగాణపై ఏర్పాటయిన ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీకి కాంగ్రెస్ లేఖ సమర్పించలేదని, తమను మాత్రం లేఖ సమర్పించాలని అంటోందని ఆయన అన్నారు. కుంటి సాకులు వెతుకుతూ తెలంగాణపై కాంగ్రెస్ తమ మీద నిందలు మోపుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రణబ్ కమిటీకి కాంగ్రెస్ లేఖ ఇవ్వాలని కూడా తాము ఒత్తిడి చేయడం లేదని, తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేసినా చాలునని ఆయన అన్నారు. లాభదాయక పదవుల బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపినా లెక్క చేయని కాంగ్రెస్ మిగతా అంశాల విషయంలో ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. మాజీ మంత్రి డి.కె. సమరసింహారెడ్డి హైదరాబాద్లో బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ను కలిశారు. తాను బిజెపిలో చేరుతున్నట్లు సమరసింహారెడ్డి చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సమరసింహారెడ్డి నరేంద్రతో కలిసి తెలంగాణ సాధన సమితి ఏర్పాటులో పాలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో తెలంగాణ సాధన సమితి విలీనమైన తర్వాత కొంత కాలం ఉండి అక్కడ పొపగక బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు కాస్తా దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పని చేశారు.