యుపిఎ వైదొలిగితే తెరాసతో పొత్తు: దత్తాత్రేయ
తిరుపతి: యుపిఎ నుంచి బయటకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా వున్నామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు. తెరాస నేతలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాకుండా ఎన్నికల కోసం కాంగ్రెస్తో పొత్తుకు, ఆ తర్వాత విలీనానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెరాస నేతలకు అధికారంపై తప్ప తెలంగాణపై, తెలంగాణ సమస్యలపై పట్టింపు లేదని ఆయన విమర్శించారు. తెరాస నాయకులు కాంగ్రెస్తోనే పోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు. తాము స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు.
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును ఆపే విషయంలో మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పి బాబ్లీ పనులు ఆపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు అవకతవకలు జరుగుతున్నాయని, ఇంతటి అవకతవకల టిటిడిని తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. టిటిడి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఇతర మతాల ప్రచారం పెరిగిందని ఆయన అన్నారు.