ఐసియులో రాహుల్ను ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ: అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న రాహుల్ మహాజన్ను పోలీసులు సోమవారం ఉదయం అపోలో ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ప్రశ్నించారు. ప్రకటన ఇవ్వడానికి రాహుల్ ఆరోగ్యం అనుమతిస్తుందని వైద్యులు నిర్ణయించిన తర్వాత మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్ అధికారి రామ్ కిషన్ నేతృత్వంలోని పోలీసులు రాహుల్ను ప్రశ్నించారు. సాక్ష్యాలుంటే శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు.
సోమవారం ఉదయమే వైద్యులు రాహుల్ను పరీక్షించి ప్రకటన చేయడానికి ఆరోగ్య పరిస్థితి అనుమతిస్తుందని ధృవీకరించారు. వీడియో కెమెరాలతో పోలీసులు రాహుల్ను ప్రశ్నించారు. వివేక్ మొయిత్రా మృతిపై, రాహుల్ ఆస్వస్థతపై ఆలస్యంగా తెలియజేసినందుకు పోలీసులు ఆస్పత్రి వైద్యులకు నోటీసులు జారీ చేశారు. అస్పత్రి వర్గాలు తమకు విషయాన్ని రెండు గంటల ఆసల్యంగా తెలియజేశాయని అదనపు డిప్యూటీ పోలీసు కమీషనర్ మనీష్ అగర్వాల్ చెప్పారు. ఇదిలావుంటే, సంఘటనా స్థలంలో లభించిన తెల్లటి పొడిలో హెరాయిన్ ఉన్నట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెసెస్ లాబొరేటరీ పరీక్షల్లో తేలింది.