లిడ్క్యాప్ భూముల రక్షణకు కలెక్టరేట్ ముట్టడి
హైదరాబాద్: లిడ్క్యాప్ భూములను విక్రయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి జరిగింది. లిడ్క్యాప్నకు చెందిన 37 ఎకరాల భూమిని సింగపూర్ కనస్ట్రక్షన్ కంపెనీకి విక్రయించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని ఆందోళనకారులు తీవ్రంగా నిరసించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు జి. సాయన్న నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ చర్యకు నిరసనగా కలెక్టరేట్ వద్ద రోడ్డు బైఠాయించి ఆందోళనకారులు బూట్ పాలిష్ చేశారు. దళితుల, బలహీనవర్గాల అండదండలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు చెందిన లిడ్క్యాప్ భూములను అమ్మాలనే నిర్ణయం తీసుకోవడం అన్యాయమని సాయన్న విమర్శించారు. ఈ భూమిని అమ్మాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అయితే తాము నచ్చజెప్పడంతో ఆ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెనక్కి తీసుకున్నారని ఆందోళనకారులు చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.