కలెక్టరేట్ ముట్టడికి యత్నం: లాఠీచార్జి
నెల్లూరు: బోగస్ ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ప్రయోగించారు. బోగస్ ఓట్లను చేర్పిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు సోమవారం ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ ముట్టడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డితో సహా పలువురు నాయకులున్నారు. అధికారులు కాంగ్రెస్ శాసనసభ్యులకు వత్తాసు పలుకుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. పక్షపాతంతో వ్యవహరిస్తున్న అధికారుల జాబితాను తాము తయారు చేస్తున్నామని, తాము అధికారంలోకి రాగానే వారని నక్సలైట్ ప్రాంతాలకు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు.