12లోగా నోటిఫికేషన్ ఇవ్వకుంటే కష్టం: ఎవియస్ రెడ్డి
హైదరాబాద్: ఈ నెల 12వ తేదీ లోగా నోటిఫికేషన్ జారీ చేస్తేనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందని, లేదంటే కష్టమని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎ.వి.యస్. రెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణపై ఆయన మంగళవారంనాడు అఖిల పక్ష నాయకులతో సమీక్ష జరిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మినహా అన్ని పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నికల వ్యయ పరిమితిలో మార్పులేదని ఆయన స్పష్టం చేశారు. ఎస్సి, ఎస్టిలకు మాదిరగానే బిసి అభ్యర్థులకు ధరావత్తులో మినహాయింపును వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాల్లోని అవకతవకలను సరిదిద్దిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఏజెంట్ల పేర్లను మూడు రోజులు ముందుగానే ఇవ్వాలనే ఎన్నికల కమీషన్ ప్రతిపాదనను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. దీని వల్ల అధికార పార్టీవారు తమ ఏజెంట్లను మభ్యపెట్టే అవకాశం ఉందని, అంతేకాకుండా కిడ్నాప్ వంటి దురాగాతాలకు అవకాశం ఉంటుందని రాజకీయ పార్టీల నాయకులు అన్నారు.
ఇదిలావుంటే, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 12వ తేదీలోగా జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. తన వద్ద దాఖలైన ఒక పిటిషన్ను పరిశీలిస్తూ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను ఎప్పుడు జారీ చేస్తారో తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై గడువులోగా ప్రభుత్వం ప్రతిస్పందించింది.