కాంగ్రెస్వారు కౌరవులు, మేం పాండవులం: నరేంద్ర
వరంగల్: కాంగ్రెస్వారంతా కౌరవులు, తమ పార్టీ వారంతా పాండవులు అని, చివరగా పాండవులదే విజయమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. రేపో మాపో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒక వైపు పొత్తుకుంటామంటూనే కాంగ్రెస్ నేతలు మరో వైపు తమ పార్టీ నుంచి వలసలను ఆహ్వానించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని కేంద్ర పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకానికి మళ్లించిందని ఆయన సర్వసభ్య సమావేశంలో అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమికి మళ్లించినట్లుగానే ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ పథకానికి మళ్లిస్తోందని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు. కేంద్ర నిధుల ఖర్చుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందని, అందుకు అనుగుణంగానే ఖర్చు చేయవలసి వుంటుందని ఆయన అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారైనా శిక్షించి తీరుతామని ఆయన చెప్పారు.