బాబ్లీపై సుప్రీంలో పిటిషన్: మంత్రివర్గం నిర్ణయం
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం చెప్పిన తర్వాత కూడా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తుండడం రాజ్యాంగ విరుద్ధమని సమావేశానంతరం సమాచార, పౌరసంబంధాల మంత్రి షబ్బీర్ అలీ మీడియా ప్రతినిధులతో అన్నారు.
కరీంనగర్లో ప్రాంతీయ పశుగణాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల బీమా పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లాల్లో నాయకులకు, మంత్రులకు మధ్య సమన్వయ లోపం చోటు చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఆయన మంత్రులకు సూచించారు. వామపక్షాలతో, తెలంగాణ రాష్ట్ర సమితితో స్థానిక పొత్తులుంటాయని ఆయన చెప్పారు. మంత్రులు తమ సొంత జిల్లాల్లోనే కాకుండా తాము ఇన్చార్జిలుగా ఉన్న జిల్లాల్లోనూ పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని కూడా ఆయన సూచించారు.