సుఖోయ్లో రాష్ట్రపతి యానం ఓ చరిత్ర
పూణే: 74 ఏళ్ల రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. సుఖోయ్ - 30 ఎంకె1 యుద్ధవిమానంలో ఆయన గురువారంనాడు ప్రయాణించారు. యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగానే కాకుండా, అత్యధిక వయస్సు గల వ్యక్తిగా కలామ్ చరిత్ర సృష్టించారు. ఈ యుద్ధ విమానానికి వింగ్ కమాండర్ అజయ్ రాథోడ్ పైలట్గా వ్యవహరించారు.
యుద్ధ విమానంలో ప్రయాణించడానికి ముందు రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. గంటకు 15 వేల కిలోమీటర్ల వేగంతో 25 వేల అడుగుల ఎత్తున అరగంట పాటు ఆ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రయాణించారు. తాను ఏ మాత్రం ఆందోళనకు గురి కాలేదని, అందుకు సమయం కూడా లేదని కలామ్ తన సాహస యాత్ర అనంతరం అన్నారు. రాథోడ్ తనకు సూచనలిచ్చారని ఆయన చెప్పారు. మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయని ఇందులో ప్రయాణించిన తర్వాత తనకు అర్థమైందని, మనకు మంచి పైలట్లు, రక్షణ అధికారులు ఉన్నారని తెలిసి వచ్చిందని ఆయన అన్నారు.