బయో డీజిల్ భవిష్యత్తు ఇంధనం: కలామ్
హైదరాబాద్: బయో డీజిల్యే భవిష్యత్తు ఇంధనమని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ అన్నారు. బయో డీజిల్పై శుక్రవారం జరిగిన వర్క్షాపులో ఆయన ప్రసంగించారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం అన్వేషించాలని ఆయన శాస్త్రవేత్తలకు సూచించారు. బయో డీజిల్, సౌరశక్తి, అణుశక్తి ప్రత్యామ్నాయ ఇంధన వనరులని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి ఇంధన వనరులపైనే ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బయో డీజిల్ పెంపకానికి మేలైన జట్రోఫా విత్తన వంగడాలను రూపొందించి రైతులకు సరఫరా చేయాలని ఆయన వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన జట్రోఫా విత్తనాలను రూపొందించి రైతులకు అందించాలని ఆయన అన్నారు. మన దేశంలో 6 కోట్ల హెక్టార్ల భూమి వృధాగా పడి ఉందని, ఇందులో సగం భూముల్లో బయో డీజిల్ను పండించవచ్చునని, వీటిలో 50 యేళ్ల వరకు ఆదాయం వస్తుందని ఆయన వివరించారు. భారతదేశంలో 2020 నాటికి 30 మిలియన్ టన్నుల బయో డీజిల్ ఉత్పత్తి, 2030 నాటికి 60 మిలియన్ టన్నుల బయో డీజిల్ ఉత్పత్తి లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు.