టిడిపితో సిపియం పొత్తు అపోహలే: కెకె
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో రాష్ట్రంలో సిపియం పొత్తు పెట్టుకుంటుందనే అనుమానాలు సిపియం కేంద్ర కమిటీ నేతలతో తాను జరిపిన చర్చల వల్ల నివృత్తి అయ్యాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. సీతారాం ఏచూరితో, బుద్ధదేవ్ భట్టాచార్యతో తాను చర్చల వల్ల సిపియం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోదనే విషయం స్పష్టమైందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సిపియం నేతలను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని, అయితే తెలుగుదేశంతో సిపియం పొత్తులపై జరుగుతున్న ప్రచారం గురించి వారితో తాను ప్రస్తావించానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేంతగా తాము దిగజారలేదని ఆ నేతలు తనతో అన్నారని ఆయన వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసినంత మాత్రాన పొత్తు పెట్టుకుంటామని అనుకోవడానికి వీలు లేదని వారు చెప్పినట్లు కేశవరావు చెప్పారు. రెండు రోజులుగా తాను ఎన్నికల పర్యటనను రద్దు చేసుకొని సిపియం నాయకులతో జరిపిన భేటీలు సత్ఫలితాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పొత్తులపై ఆయన రేపు వామపక్షాలతోనూ, ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర సమితితోనూ చర్చలు జరుపుతారు.