బిటి విత్తన కంపెనీలపై 9 రాష్ట్రాలు పోరు
హైదరాబాద్: బిటి విత్తనాల బహుళ జాతి సంస్థల దురాగతాలను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పని చేయాలని తొమ్మిదిది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చాయి. మోన్శాంటో బహుళ జాతి విత్తన సంస్థతో పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాల సమావేశాన్ని శుక్రవారం హైదరబాద్లో ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బిటి విత్తనాల ధరలను అదుపు చేయడానికి జాతీయ స్థాయిలో ఒక నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
తాము సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకం కాదని, అయితే సాంకేతిక పరిజ్ఞానం సన్న, చిన్నకారు రైతులకు అందాలని, సాంకేతిక పరిజ్ఞానం పేరుతో రైతులను మోసం చేస్తే సహించబోమని ఈ రాష్ట్రాలు స్పష్టం చేశాయి. మోన్శాంటోతో చేస్తున్న పోరాటంతో కేంద్రం కూడా కలిసి రావాలని కోరుతూ తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ విత్తన చట్టం - 2004ను అన్ని రాష్ట్రాలకు వర్తించేలా తయారు చేయాలని కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సమావేశం తీర్మానం చేసింది.