గెలిచే సత్తా మాకుంది: ఇంద్రసేనారెడ్డి
హైదరాబాద్: ఒంటరిగా పోటీ చేసినా పంచాయతీ ఎన్నికల్లో గెలిచే సత్తా తమకు ఉందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన కొంత మంది తెలుగుదేశం కార్యకర్తలు ఇంద్రసేనా రెడ్డి సమక్షంలో సోమవారంనాడు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలతో విసిగిపోయినవారు తమ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. బిజెపిపై తెరాస నాయకులు చేసిన విమర్శిపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణవాదాన్ని అడ్డం పెట్టుకుని పదవులు సంపాదించుకున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతూ తెరాస నేతలు పదవుల్లో కొనసాగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.