టిడిపివి అవకాశవాద పొత్తులు: వైయస్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అవకాశవాద పొత్తులకు దిగుతోందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి విమర్శించారు. గెలవలేకనే ఖమ్మం, నల్లగొండ జిల్లా పరిషత్లను తెలుగుదేశం పార్టీ సిపియంకు ఇచ్చిందని ఆయన సోమవారంనాడు వ్యాఖ్యానించారు. సైద్ధాంతిక ఆలోచన కొరవడిన పొత్తులకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతోందని ఆయన అన్నారు. లౌకికవాదంపై నమ్మకం లేని తెలుగుదేశం పార్టీతో సిపియం పొత్తులు పెట్టుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 400 మంది సోమవారం వైయస్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
సిపియంతో పొత్తుకు తాము సుముఖంగానే ఉన్నామని, అందుకే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డామని ఆయన అన్నారు. సిపియం నేతలు అడిగిన మేరకు జడ్పిటిసిలు, ఎంపిటిసిలు ఇవ్వడానికి ముందుకు వచ్చామని ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తు సిపియం తెలుగుదేశం పార్టీతో కలిసి పోవడానికి సిద్ధపడిందని ఆయన అన్నారు. గెలవలేనప్పుడు తెలుగుదేశం పార్టీ సిపియంకు రెండు జడ్పిటిసీలు ఇస్తేనేం, 24 జడ్పిటిసిలు ఇస్తేనేం అని ఆయన వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలో సిపియంతో పొత్తు కుదరకపోవడం దురదృష్టకరమని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. అయినా నల్లగొండ జిల్లాలో గెలుపు కాంగ్రెస్దేనని ఆయన అన్నారు.