సంస్కరణల ఫలితాలు పేదలకు అందాలి: బాబు
హైదరాబాద్: సంస్కరణలకు తాము వ్యతిరేకం కాదని, అయితే సంస్కరణల ఫలితాలు పేదలకు అందాలన్నదే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఆయన మంగళవారం తన నివాసం నుంచి పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కుతూనే ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానల్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సంస్కరణలపై భావసారూప్యం గల పార్టీలతో జాతీయ స్థాయిలో చర్చల నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆదాయం కోసం అంతర్జాతీయ ధరల పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని, పేదలపై, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతోందని ఆయన ఆయన విమర్శించారు. ముందుచూపుతో తమ ప్రభుత్వ హయాంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)ని ప్రోత్సహిస్తే కాంగ్రెస్ నాయకులు ఎగతాళి చేశారని, ఇప్పుడు ఫలితాలు కనిపిస్తుండడంతో తమదే గొప్ప అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సిపియంతో తెలుగుదేశం పార్టీ పొత్తును అవకాశవాదమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అనడాన్ని ఆయన ఖండించారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి భయంతో అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు.