తెరాస మాటలు వేరు, చేతలు వేరు: ఇంద్రసేన్
మహబూబ్నగర్: తెలంగాణను వ్యతిరేకించే పార్టీలపై పోటీ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు సిపియం, సిపిఐలపై పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టడం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం వద్ద మెప్పు పొందడానికి పంచాయతీ ఎన్నికల్లో గెలవాని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అనుకుంటున్నారని, అందుకు అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాలు ఇవ్వకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారికి నమోదు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు నామినేషన్ గడువును మరో రెండు రోజులు పెంచాలని ఆయన ఎన్నికల కమీషన్ను కోరారు. ఈ నెల 15వ తేదీలోగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.