బాబుది పుట్టుకతో అయితే సిపియంది ఇప్పుడు: వైయస్
హైదరాబాద్: అవకాశవాద తెలుగుదేశం పార్టీతో సిపియం పంచాయతీ ఎన్నికల్లో అవగాహనకు రావడం బాధాకరమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అన్నారు. సిపియం కూడా పూర్తి అవకాశవాద మార్గాన్ని ఎంచుకుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సిపియంకు చెందిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాను అల్పాహార విందు ఇచ్చినప్పుడు సిపియం తెలుగుదేశం పార్టీతో అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారని తమ పార్టీ అధ్యక్షుడు కె. కేశవరావు అన్నారని, దానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రతిస్పందిస్తూ తాము అంత అవకాశవాదులం కాదని అన్నారని ఆయన వివరిస్తూ సిపియం తెలుగుదేశం పార్టీతో జత కట్టడాన్ని వ్యాఖ్యానించారు.
సిపియం నాయకులు కావాలనే కాంగ్రెస్కు దూరమై, తెలుగుదేశం పార్టీతో జత కట్టారా అని మీడియా ప్రతినిధులు అడిగితే వారి మనస్సులో ఏముందో తనకేం తెలుస్తుందని, ఆ ప్రశ్న వేయాల్సింది సిపియం నాయకులకేనని ఆయన జవాబిచ్చారు. తెలుగుదేశం పార్టీతో తాము పొత్తు పెట్టుకోవడం లేదని సిపియం కార్యదర్శి రాఘవులు అనడాన్ని రాజశేఖర రెడ్డి గుర్తు చేస్తూ " ఎవరు మాత్రం ఎందుకు మద్దతిస్తారు? పరస్పర సహాయానికి ముందుకు వచ్చినప్పుడే అటువంటి మద్దతులుంటాయి అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో సిపియం 10 - 12 జిల్లాల్లో అవగాహన కుదుర్చుకున్న తర్వాత మిగతా జిల్లాల్లో సిపియం స్థానిక నాయకులు తమ పార్టీతో అవగాహనకు ముందుకు వచ్చారని, అయితే అందుకు తాను వ్యతిరేకత వ్యక్తం చేశానని, అలా కుదుర్చుకుంటే ప్రజలు హర్షిస్తారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. సిపియం తిరిగి కాంగ్రెస్తో స్నేహానికి ముందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారా అని అడిగితే తానేమీ జ్యోతిశ్శాస్త్ర పండితుడినని కానని సమాధానమిచ్చారు. సిపియంకు తాము వారి స్థాయి కన్నా ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చామని, అయినా సిపియం వెనక్కి వెళ్లిందని ఆయన అన్నారు. సిపియం డిమాండ్ల పరిష్కారం కోసం తాము కృషి చేసినా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పుట్టుకతోనే అవకాశవాది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అవకాశవాద పార్టీ అని, అధికారం కోసమే పని చేస్తుందని, దానికి ఒక సిద్ధాంతమంటూ లేదని ఆయన అన్నారు. బిజెపితో తెలుగుదేశం పొత్తు, బిజెపితో తెగదెంపుల వ్యవహారమంతా తెలుగుదేశం అవకాశవాదాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు. రేషన్కార్డుల పంపిణీని ఆపించి తెలుగుదేశం పార్టీ పేదల పొట్ట కొడుతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై రాజశేఖర రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటుపై తెలంగాణ రాష్ట్ర సమితితో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. తమపై ప్రజావిశ్వాసం సంపూర్ణంగా ఉందని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తమనే గెలిపిస్తారని ఆయన అన్నారు. తాము 22 జిల్లాలో విజయం సాధిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు.