కేశవరావుకు అధికారం తలకెక్కింది: వెంకయ్య
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుకు అధికారం తలకెక్కిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కులం, ధనం వల్లనే సిపియం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందనే కేశవరావు వ్యాఖ్యపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. అధికారం తలకెక్కితే ఏమైనా మాట్లాడవచ్చునని కేశవరావు ఉద్దేశ్యమా? అని ఆయన అడిగారు.
పొత్తులు పెట్టుకునే స్వేచ్ఛ అన్ని రాజకీయ పార్టీలకు ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పొత్తులు కుదుర్చుకోదా? అని ఆయన అడిగారు. రాజీవ్ గాంధీని హత్య చేసిన శక్తులతో చేతులు కలిపిందని కాంగ్రెస్ డియంకెను విమర్శించిందని, అయితే అదే పార్టీతో తర్వాత పొత్తు కుదుర్చుకుందని ఆయన అన్నారు. సిపియంతో పొత్తు చెడిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నంలో ఉందని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ముఖమే తెలియని తెలంగాణకు సుఖం లేదని ఆయన అన్నారు.