మా అభ్యర్థులకు ప్రాణభయం: టిడిపి
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు ప్రాణభయం ఉందని తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తమ పార్టీ అభ్యర్థులు హైదరాబాద్లో తలదాచుకునే పరిస్థితిని కాంగ్రెస్వారు కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి విజయరామారావు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలను ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు. అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
కార్మిక మంత్రి వినోద్, అధికారులు తప్పుడు కులధృవీకరణ పత్రాలు ఇస్తుండడంపై సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారంటే అధికార దుర్వ్యినియోగం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చునని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అధికార దుర్వ్యినియోగం సంఘటనలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఇసికి విజ్ఞప్తి చేశారు.