రెండు చోట్ల ఘర్షణ: టిడిపి అభ్యర్థి కిడ్నాప్
హైదరాబాద్: పంచాయతీ సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా తాడిమర్రిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి అభ్యర్థుల బీ ఫారాలను కాంగ్రెస్వారు చింపేయడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
ఇదిలావుంటే, కడప జిల్లా అట్లూరు మండలంలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి అభ్యర్థి నాగయ్యను ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారు. దీంతో అతను బీ ఫారం సమర్పించలేకపోయాడు. అయితే తెలుగుదేశం డమ్మీ అభ్యర్థి బీ ఫారం నామినేషన్ దాఖలు చేశాడు. దీనివల్ల కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించలేదు. నాగయ్యను కిడ్నాప్ చేసి ఏకగ్రీవంగా యంపిటిసి స్థానాన్ని దక్కించుకోవాలన్న ఆశలు వమ్మయ్యాయి. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య పొత్తుకు గండిపడింది. ఇరు పార్టీలు తమ పార్టీల అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడంతో పొత్తు చెదిరింది. రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో రెబెల్స్ బెడద తప్పేట్లు లేదు.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అర్హులైనవారికి బీ ఫారాలు ఇవ్వలేదని నిరసిస్తూ వారు వీరంగం సృష్టించారు. పార్టీ కార్యాలయంపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు.