తీర్పు మాకు అనుకూలంగా వస్తుంది: కెకె
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ యథాతధంగా కొనసాగుతుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఆగలేదని ఆయన చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆటంకం రాలేదని ఆయన చెప్పారు. తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు తాము కుట్ర పన్నినట్లు కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన విమర్శను తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ఖండించారు. అక్రమాలు జరిగితే కూడా మాట్లాడవద్దా అని ఆయన అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోవాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు సూచించారు. ఎన్నికల కమీషన్, ప్రభుత్వం చేసిన తప్పిదాలను పరిశీలించాల్సి ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిందని, అందువల్ల సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చలేదని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.