టిడిపితో పొత్తుపై సిపియం సంతృప్తి
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు తమకు సంతృప్తిని మిగిల్చిందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయించాలనే నినాదంతో తాము ఎన్నికల ప్రచారం సాగిస్తామని ఆయన చెప్పారు.
మంత్రులు, శాసనసభ్యులు, అధికారులదే పెత్తనం సాగుతోందని, ఆదర్శ గ్రామాల ఎంపిక కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతోందని, స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించాలని తాము ప్రచారంలో ప్రధానాంశాలుగా చేసుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెస్తో సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితిల పొత్తుల కన్నా సిపియం, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కాస్తా సజావుగా జరిగింది. చాలా చోట్ల ఇరు పార్టీలకు మధ్య పొత్తులు కుదిరాయి. సిపిఐకి, కాంగ్రెస్కు మధ్య కేవలం తొమ్మిది జిల్లాల్లో మాత్రమే పొత్తులు కుదిరాయి.