హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో నిరీక్షణ
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కోసం రాజకీయ పార్టీల నాయకులు ఉత్కంఠతో ఎదురుచూశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు గురువారం ఉదయం నుంచే హైకోర్టు తీర్పు కోసం పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో వేచి వున్నారు. అయితే తీర్పు మధ్యాహ్నానికి వాయిదా పడడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. జిల్లాల నుంచి వచ్చినవారి పట్ల ఆయన తన అసహనాన్ని ప్రదర్శించారు. కొద్దిసేపు తన గదిలోకి వెళ్లి దీర్ఘాలోచనలో పడ్డారు. అడ్వొకేట్ జనరల్ మోహన్ రెడ్డి వాదించిన తీరు పట్ల ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ నేతృత్వంలో కమిటీ వేసినా ఓటర్ల జాబితా నూటికి నూరు శాతం తప్పులు లేకుండా ఉండడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తీర్పు కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో కూర్చుని నిరీక్షించారు. పరిస్థితిని ఆయన కార్యాలయం నుంచి సమీక్షించారు. ఎన్నికలు ఇప్పుడు జరిగితేనే మంచిదని ఆయన అభిప్రాయపడుతునట్లు సమాచారం. అయితే ఓటర్ల జాబితాలో తమ పార్టీకి చెందినవారి పేర్లు పెద్ద యెత్తున గల్లంతు కావడంపై ఆయన ఆరా తీస్తున్నారు.