మా అదుపులో ఉంది సుధాకర్ కాడు: యస్పీ
విజయనగరం/హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉంది మావోయిస్టు ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు కమిటీ కార్యదర్శి సుధాకర్ కాదని విజయనగరం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ స్పష్టం చేశారు. తమ అదుపులో ఒక నక్సలైట్ ఉన్న మాట వాస్తవమేనని, అయితే అతను సుధాకర్ కాడని ఎస్పీ అంటున్నారు. సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం రాత్రి వదంతులు వ్యాపించాయి. పోలీసుల కాల్పుల్లో సుధాకర్ గాయపడ్డాడని, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పెద్ద యెత్తున ఊహాగానాలు చెలరేగాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మావోయిస్టు నాయకుల్లో సుధాకర్ కూడా ఒకరు.
విజయనగరం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా సుధాకర్ పట్టుబడినట్లు వదంతులు చెలరేగాయి. ఎన్కౌంటర్కు ముందే సుధాకర్కు బంధువులైన ట్రాన్స్కో ఎ ఇ కృష్ణమూర్తి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. సుధాకర్ పోలీసుల చేతిలో ఉన్నాడనే వదంతులతో ప్రజా గాయకుడు గద్దర్, విరసం నాయకుడు కల్యాణరావు బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. సుధాకర్ను కోర్టులో హాజరు పరచాలని వారు హోం మంత్రి కె. జానారెడ్డిని కలిసి కోరారు. అయితే సుధాకర్ తమ అదుపులో లేడని జానారెడ్డి తెలిపారు. సుధాకర్ను కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. మావోయిస్టులు ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దుల్లో బంద్కు పిలుపునిచ్చారు.