ఆ ఇద్దరూ తెలంగాణ వ్యతిరేకులే: దత్తాత్రేయ
వరంగల్: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఒక్కటేనని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రజల మనోవాంఛలకు వ్యతిరేకంగా వారిద్దరు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సోమవారం రఘునాథపల్లె సభలో పాల్గొన్నారు.
అనేక విషయాల్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలకు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణను వ్యతిరేకించే విషయంలో మాత్రం ఇద్దరూ ఒక్కటేనని ఆయన అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేస్తే, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదని రాజశేఖర రెడ్డి అంటుండగా వెనకబడిన తెలంగాణను అభివృద్ధి చేస్తే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ అవసరం లేదని చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.