తొలి దశ ఎన్నికలు: ప్రచారానికి తెర
హైదరాబాద్: తొలి విడత ఎన్నికలు జరిగే జిల్లాలో సోమవారం సాయంత్రం ప్రచారానికి తెర పడింది. మొదటి విడత 11 జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లకు మద్యం, నగదు పంపిణీకి రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. ముందుగానే మద్యాన్ని నిల్వ చేసి పెట్టుకున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద యెత్తున అభ్యర్థులు ఖర్చు పెట్టారు.
ఎన్నికల అక్రమాలపై తెలుగుదేశం పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఓటర్ల జాబితాలో తీవ్రమైన అక్రమాలకు పాల్పడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శిస్తున్నారు. ఒక్క జడ్పిటిసి స్థానానికి కాంగ్రెస్ నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కూడా ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల కమీషన్ అధికార పార్టీ ఆగడాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కూడా ఆయన విమర్శిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన సిపియం ఈసారి తెలుగుదేశం పార్టీతో జత కట్టింది. సిపిఐ మాత్రం కాంగ్రెస్తోనే ఉండిపోయింది. దీంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చెరో శిబిరంలో చేరిపోయాయి. బిజెపి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పటికీ అంతా అయోమయం, గందరగోళం నెలకొంది.