ముఖరంజా మూడో భార్యకు ఊరట
హైదరాబాద్: హైదరాబాద్ నిజాం మనవడు ప్రిన్స్ ముఖరంజా భార్య మూడవ భార్య మనోల్యాకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడింది. చిరాన్, ఫలక్నుమా, చౌమొహల్లా ప్యాలెస్లను అమ్మడానికి వీలు లేదని కోర్టు ఆదేశించింది. మనోల్యాకు ఆరు శాతం వడ్డీతో పది లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆమెకు నెలకు 15 వేల అమెరికన్ డాలర్ల మనోవర్తి చెల్లించాలని కూడా ఆదేశించింది. ముఖరంజా, మనోల్యా విడాకుల కేసుపై కోర్టు విచారణ జరిపింది. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేయాలని ప్రిన్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
టర్కీకి చెందిన మనోల్యాను ప్రిన్స్ ముఖరంజా 1985లో వివాహమాడారు. 1998లో ఆమెకు ఆయన విడాకులు ఇచ్చారు. అప్పటి నుంచి భరణం కోసం ఆమె న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. 400 కోట్ల రూపాయల విలువ చేసే చిరాన్ ప్యాలెస్ను తమ కూతురికి అప్పగించాలని మనోల్యా చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.