పార్టీ నుంచి దొంతి మాధవరెడ్డి సస్పెన్షన్: కెకె
వరంగల్: వరంగల్ జిల్లా గూడూరు జడ్పిటిసి అభ్యర్థి కంచె ఐలయ్య హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న దొంతి మాధవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. ఐలయ్య కుటుంబ సభ్యులను ఆయన సోమవారంనాడు పరామర్శించారు. ఐలయ్య కుటుంబానికి పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఐలయ్య హత్యలో నిందితులుగా భావిస్తున్న దొంతి మాధవరెడ్డిని, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఐలయ్య హంతకులు ఎంతటివారైనా వారిని వదిలి పెట్టేది లేదని ఆయన అన్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్లోని అవతలి గ్రూప్ నుంచి వచ్చి ఈ గ్రూపులో చేరుతున్నట్లు ఇద్దరు ఐలయ్యతో నమ్మ బలికారని, వారే ఈ హత్యకు పాల్పడ్డారని ఐలయ్య అనుచరులు ఆరోపిస్తున్నారు. ఐలయ్య హత్యను మంత్రి రెడ్యా నాయక్ ఖండించారు. ఐలయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.