పాలమూరు జిల్లాలో 8 మంది నక్సల్స్ హతం
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా అడవుల్లో మంగళవారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళా నక్సలైట్లున్నారు. మృతుల్లో దళ కమాండర్ మహేష్తో పాటు డిప్యూటీ కమాండర్ స్వరూప ఉన్నట్లు సమాచారం.
సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహబూబ్నగర్ జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగింది. నక్సలైట్లకు, పోలీసులకు మధ్య చాలా సేపు ఎదురుకాల్పులు జరిగాయి. మల్లయ్యపెంట అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత సాంబశివుడు తప్పించుకున్నట్లు సమాచారం.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు సమావేశమైనట్లు గ్రేహౌండ్స్ పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకు వారు మావోయిస్టుల సమావేశంపై దాడి చేశారు. ఈ సమావేశంలో మహబూబ్నగర్ జిల్లా మావోయిస్టు కార్యదర్శి సాంబశివుడితో పాటు రాష్ట్ర నేతలు కూడా కొందరు పాల్గొన్నట్లు సమాచారం. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. అది సాయంత్రం వరకు కొనసాగింది. ఎన్కౌంటర్ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల్లో ఆరుగురిని పోలీసులు గుర్తించారు. వీరిలో దళ కమాండర్ మహేష్, డిప్యూటీ దళ కమాండర్ స్వరూపలతో పాటు ఇందిర, పుష్ప, పద్మ, సుగుణలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వీరంతా మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట దళానికి చెందినవారని వారంటున్నారు.