కాంగ్రెస్ది ఇష్టారాజ్యం, ఇసిది ప్రేక్షకపాత్ర: బాబు
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీవారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఇంత దారుణంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతనిధుల సమావేశంలో అన్నారు. ఎన్నికల కమీషన్ ప్రేక్షకపాత్ర వహించిందని ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో పోలీసుల పర్యవేక్షణలో కాంగ్రెస్వారు రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలను గృహనిర్బంధంలో ఉంచి, కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి పోలీసులు అనుమతించారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లా అంతటా రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ వారు ఎన్నికలను గందరగోళ పరిచే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో, మరికొన్ని ప్రాంతాల్లో తమ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ఆగడాలను సమర్థంగా ఎదుర్కున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి నియోజకవర్గాల్లో పోలింగ్ ఎన్నికల తీరుకు అద్దం పడుతుందని ఆయన అన్నారు. ధన, కండ, అధికార బలాలతో కాంగ్రెస్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆయన అన్నారు. ఎన్నికలు ప్రహసంగా మారాయని ఆయన అన్నారు. డబ్బులు, మద్యం విపరీతంగా పంచారని ఆయన ఆరోపించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కాంగ్రెస్వారు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.