కాంగ్రెస్కు అప్పుడు గుర్తు రాలేదా?: ఏచూరి
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అవకాశవాదమని కాంగ్రెస్ చేసిన విమర్శను సిపియం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఖండించారు. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో రాష్ట్ర కమిటీ పొత్తుకు నిర్ణయం తీసుకుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ పార్టీ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయం తమ పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యను కూడా ఆయన ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్తో కలిసి విద్యుత్ ఉద్యమం చేపట్టడం గానీ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం గానీ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయమని ఎందుకు అనిపించలేదని ఆయన కాంగ్రెస్ను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీనో, కాంగ్రెస్నో బలపరిచే బాధ్యత తమది కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగానే తమ రాష్ట్ర కమిటీ కాంగ్రెస్కు దూరమైందని ఆయన అన్నారు. పోలవరం విషయంలోనూ, గంగవరం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మాట ఖాతరు చేయలేదని, తమ పార్టీ నాయకులను అరెస్టు చేసిందని ఆయన అన్నారు.