కడప జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ: టిడిపి
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా కడపలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. కడప జిల్లా అంతటా రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. అల్లాడి పి. రాజ్కుమార్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డిని కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. ఎన్నికల అక్రమాలపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అనుకుంటోంది.
తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఎన్నికలను చూడలేదని అల్లాడి పి. రాజ్కుమార్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, అక్రమాలకు దూరంగా నిర్వహించడంలో ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ వారు అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆయన అన్నారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోయాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో 75 చోట్ల రీపోలింగ్ నిర్వహంచాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమీషన్కు విజ్ఞప్తి చేసింది. అనంతపురం జిల్లా పెనుకండ మండలంలో రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత ఎన్నికల కమీషన్కు విజ్ఞప్తి చేశారు.