పోలింగ్: ఒకరి మృతి, 50 మందికిపైగా గాయాలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు భూమా వీరనాగిరెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు రామిరెడ్డిని కూడా పోలీసులు గృహ నిర్బంధంంలో ఉంచారు. కాగా కర్నూలు జిల్లా డోన్ శాసనసభ్యురాలు కోట్ల సుజాత పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకూడదనే నిబంధనను ఆమె ఉల్లంఘించారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీదేవి సబ్ ఇన్స్పెక్టర్పై చేయి చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో అక్రమాలను నిరసిస్తూ పెనుకొండ శాసనసభ్యురాలు పరిటాల సునీత ధర్నాకు దిగారు. పెనుకొండ, రొద్దం మండలాల్లో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆమె ధర్నాకు దిగారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మాజీ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు ధర్నాకు దిగారు. పోలింగ్ హింసకు కృష్ణా జిల్లాలో ఒకరు బలయ్యారు. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో దాదాపు 50 మంది దాకా గాయపడ్డారు.కర్నూలు జిల్లా డోన్ మండలం చనుగొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు తిరుగుబాటు అభ్యర్థులను హత్య చేశారు.
పోలింగ్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్వారు రిగ్గింగ్కు, సైక్లింగ్కు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు శమంతకమణి ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ అక్రమాల పట్ల ప్రేక్షకపాత్ర వహించారని ఆమె అన్నారు. ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆమె అన్నారు. కడప జిల్లా కలెక్టరేట్ ముందు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. కడప జిల్లాలో ఘర్షణలు, కాల్పులు, బాంబు దాడుల వంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా సరస్వతీనగర్లో దుండగులు బ్యాలెట్ బాక్సులను నీటిలో పడేశారు. ముద్దనూరులో ఘర్షణ చెలరేగింది. పోలింగ్ బూత్ వెనక నుంచి తెలుగుదేశంవారు బాంబులు వేశారని, దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారని సమాచారం. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం జమ్మలమడుగులో ఇరు వర్గాల వారు పరస్పరం బాంబులు విసురుకున్నారు. ఇదే జిల్లా మేళ్లచెర్వు మండలం నెమలిపురిలో బ్యాలెట్ బాక్స్ల్లో నీళ్లు పోశారు.
అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమీషన్ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కృష్ణా జిల్లా బంటుమిల్లి ఒకటవ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ యంపిటిసీ అభ్యర్థి తలను కాంగ్రెస్ కార్యకర్తలు పగులగొట్టారు. నల్లగొండ జిల్లా పోచంపల్లి మండలంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ జరుగుతుంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంగళవారం సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ను అనుమతించారు. నల్లగొండ జిల్లాల్లో 70 శాతం, కరీంనగర్ జిల్లాలో 68 శాతం, కడప జిల్లాలో 69 శాతం, కర్నూలు జిల్లాలో 68 శాతం, మెదక్ జిల్లాలో 65 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 55 శాతం, ప్రకాశం జిల్లాలో 70 - 75 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. మొత్తం మొదటి విడత పోలింగ్ జరిగిన 11 జిల్లాల్లో సగటున 68 శాతం పోలింగ్ నమోదైంది. కడప జిల్లా మైదుకూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు (యస్)లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దగొడ్డుపాలంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆరుగురికి గాయాలయ్యాయి. ఇదే జిల్లా చలపాక, పెద్దకూరపాడులలో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.