2001లో కన్నా స్థానిక ఎన్నికలు ప్రశాంతం: వైయస్
హైదరాబాద్: 2001లో కన్నా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ప్రశాంతంగానే జరిగాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలింగ్ జరిగిన 11 జిల్లాల్లో 25 చోట్ల మాత్రమే రీపోలింగ్కు అవకాశం ఉందని ఆయన అన్నారు. అది కూడా పది చోట్ల బ్యాలెట్ పేపర్లలో పొరపాట్ల వల్లనే రీపోలింగ్ అవసరమవుతోందని ఆయన అన్నారు.
ఓటర్లకు అక్కడక్కడా ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. రేషన్ కార్డుల పంపిణీ పూర్తిగా జరిగి వుంటే ఆ ఇబ్బంది ఉండేది కాదని, రేషన్కార్డుల పంపిణీ జరగకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని ఆయన అన్నారు. అధికార కాంగ్రెస్పార్టీని, ఎన్నికల కమీషన్ను ఆత్మరక్షణలో పడేసిందుకే తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. ఏ చిన్న సంఘటన జరిగినా పెద్దది చేసి మీడియాకు, కోర్టులకు వెళ్లిందని ఆయన అన్నారు. ఎన్నికల గెలుపు ప్రతిష్ట పూర్తిగా కాంగ్రెస్కు దక్కకుండా చేయాలనేది తెలుగుదేశం పార్టీ ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిందని ఆయన విమర్శించారు.
తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ అన్నారు. పోలింగ్ ఘర్షణల్లో ఐదుగురు మాత్రమే గాయపడ్డారని ఆయన చెప్పారు. జరిగిన హత్యలు రాజకీయపరమైనవి కావని ఆయన అన్నారు. పోలింగ్ సందర్భంగా 15,491 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.