ప్రపంచబ్యాంక్ ఒప్పందాలు వెల్లడించండి: సిపియం
ఖమ్మం: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్తో చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు డిమాండ్ చశారు. విద్య, వైద్య రంగాలకు చెందిన నిధులను జలయజ్ఞానికి తరలించడం వల్లనే వైద్య సేవల్లో సంక్షోభం ఏర్పడిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైద్యరంగానికి నిధులు లేక మందుల కొరత ఏర్పడిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో చికన్గున్యా వ్యాధితో ప్రజలు బాధలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్య ఇవాళ్ల ఆస్పత్రులను సందర్శిస్తున్నారని ఆయన అన్నారు. చికన్గున్యా వల్ల ఎవరు చచ్చిపోరని అంటూ రోశయ్య ప్రజలను అపహాస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. అక్రమాలతో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. డబ్బు, పోలీసు బలాలతో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. 11 జిల్లా పరిషత్లు తమవేనని ముఖ్యమంత్రి అనడాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ గెలుపు డబ్బు, పోలీసు గెలుపు అవుతుందని ఆయ అన్నారు.