ఎవియస్ రెడ్డి రాజీనామాకు టిడిపి డిమాండ్
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డి గాంధారి పాత్ర పోషించారని తెలుగుదేశం నాయకులు అల్లాడి పి. రాజ్కుమార్, అనురాధ, ఇ. పెద్దిరెడ్డి విమర్శించారు. ఎవియస్ రెడ్డి కళ్లకు గంతలు కట్టుకొని పోలింగ్ అక్రమాలను చూడలేకపోయారని వారు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎవియస్ రెడ్డి ప్రేక్షకపాత్ర వహించారని వారన్నారు. ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమైన ఎవియస్ రెడ్డి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నికలు నిర్వహించేది ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డా, ఎన్నికల కమీషనర్ ఎవియస్ రెడ్డా అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడిందని వారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు, తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారని వారన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగిన చోట్ల విజయం తమదేనని వారన్నారు.