రీపోలింగ్ ప్రశాంతం: అనంతలో అదే తీరు
హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగిన 11 జిల్లాల్లోని 54 కేంద్రాల్లో శుక్రవారం దాదాపుగా రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనంతపురం జిల్లాలో మాత్రం భయం నీడలు వదిలిపోలేదు. అనంతపురం జిల్లా మావుటూరులో ఓట్లు వేయడానికి వస్తున్నవారిని కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరించారు. దీంతో పోలీసులు నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులు నచ్చజెప్పినప్పటికీ కొన్ని చోట్ల ఓట్లు వేయడానికి ప్రజలు భయపడ్డారు. నారనాగేపల్లికి చెందిన ఓటర్లు భయంతో కర్ణాటక నుంచి వచ్చి ఓట్లు వేసి పోలీసు వాహనాల్లో వెళ్లిపోయారు. అనంతపురం జిల్లాలో శుక్రవారంనాడు పది కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది.
అనంతపురం జిల్లాలోని వెంగనపల్లి గ్రామప్రజలు ఓటు వేయడానికి భయపడ్డారు. గత రాత్రి కొంతమంది వచ్చి భయపెట్టడంతో వారు ఓటు వేయడానికి ముందుకు రాలేదు. కడప జిల్లాలో ఆరు కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. ఖమ్మం జిల్లాలో ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. నల్లగొండ జిల్లాలో పది కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. కర్నూలులో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కాగా, రెండవ విడత పోలింగ్ జరిగే 11 జిల్లాల్లో ప్రచార ఘట్టానికి తెరపడింది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో గత రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి అభ్యర్థి మునుస్వామిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. వీరికి పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ధర్నా చేశారు.