పోలింగ్ హింసకు ఇద్దరు బలి: పలుచోట్ల దాడులు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా నారాయణవరం మండలం ఎరికింబట్టు గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు మారణాయుధాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించాడు. చిత్తూరు జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడిన పోలింగ్ బూత్ల్లోని బాక్స్ల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీళ్లు పోస్తూ పోయారు. గుంటూరు జిల్లా పల్నాడులో మరో వ్యక్తి మరణించాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. పోలింగ్ బూత్ వద్ద ప్రారంభమైన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యక్తిని చితకబాదారు. దీంతో కాంగ్రెస్వారు కర్రలతో ప్రత్యర్థులపై దాడి చేశారు. ఈ దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
మంత్రి సబితారెడ్డి ఇంద్రారెడ్డి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం అమ్దాబాద్లో కాంగ్రెస్వారు తెలుగుదేశం పార్టీవారిపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఈ సందర్భంగా ఘర్షణ చెలరరేగింది. ఈ సందర్భంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వర్లు పోలింగ్ బూత్ల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీన్ని తెలుగుదేశం, సిపియం కార్యకర్తలు అడ్డుకున్నారు. సిపియం, తెలుగుదేశం పార్టీలు పెద్ద యెత్తున డబ్బులు పంచుతున్నారని శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా సంఘీనగర్ ప్రాంతంలోని మీర్పేటలో కాంగ్రెస్, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలింగ్ బూత్లోకి కాంగ్రెస్వారిని యధేచ్ఛగా రాణిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగింది.
వరంగల్ జిల్లా బొల్లేపల్లి గ్రామంలో ఒక ఓటరుపై పోలీసు కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు సబ్ ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు కానిస్టేబుళ్లను నిర్బంధించారు. నిజామాబాద్ జిల్లాలోని మంత్రి డి. శ్రీనివాస్ స్వగ్రామంలో టిడిపి, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. వరంగల్ జిల్లా మంగళవారిపేటలో తాము స్వాధీనం చేసుకున్న బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. గుంటూరు జిల్లా కొమ్మూరులో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపిడివోపై దాడికి దిగారు.