కొత్త రక్తంతో లోక్సత్తా కొత్త రాజకీయాలు
హైదరాబాద్: రాజకీయ సంస్కృతి ప్రత్యామ్నాయంపై లోక్సత్తా ఆదివారం చర్చా పత్రాన్ని విడుదల చేసింది. కొత్త తరానికి కొత్త రక్తంతో నిండిన నూతన రాజకీయాన్ని అందించడమే తమ లక్ష్యమని లోక్సత్తా సమన్వకర్త జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాజకీయ సంస్కృతి ప్రత్యామ్నాయంపై లోక్సత్తా సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. స్వచ్ఛమైన రాజకీయ సంస్కృతితో కూడిన రాజకీయ వ్యవస్థను అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తాము విడుదల చేసిన పత్రంపై చర్చ జరిగిన తర్వాత కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాల్లో కాలు పెట్టడానికి లోక్సత్తా మొదట ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఎందుకోగాని వెనక్కి తగ్గింది. పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు సంకల్పించింది. అయితే ఇప్పుడు తాజాగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి లోక్సత్తా ముందుకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యల కోసం చాలా కాలంగా లోక్సత్తా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది.