రెండో దశ పోలింగ్లోనూ హింస, రిగ్గింగ్, ఘర్షణలు
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సందర్భంగా కూడా అక్రమాలు, ఘర్షణలు, బూత్ల ఆక్రమణలు, రిగ్గింగ్ యధావిధిగా జరిగిపోయాయి. రాష్ట్రంలోని మిగతా 11 జిల్లాల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, మహబూబ్నగర్ జిల్లాల్లో పలు చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య కొన్ని చోట్ల ఘర్షణలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసాఫీసర్ షాలినీ మిశ్రా వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కె. యస్. రత్నంను పోలీసులు అరెస్టు చేశారు. రత్నం ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో పోలింగ్ హింసకు ఒకరు బలయ్యారు. కొన్ని పోలీసుల గాలిలోకి కాల్పులు జరిపారు.
బ్యాలెట్ బాక్స్లను ఎత్తుకుపోయి బావుల్లో పారేసిన సంఘటనలు, బ్యాలెట్ బాక్స్ల్లో ఇంకుపోసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం బాంబుల మోతతో దద్ధరిల్లింది. హింసలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గుంటూరు జిల్లా ఇంకొర్రులో జరిగిన బాంబు దాడుల్లో ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం కారణంగా పోలింగ్కు అంతరాయం కలుగుతోంది. గుంటూరు జిల్లా తూపాడులో కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు పరస్పరం బాంబులు విసురుకున్నారు. చిత్తూరు జిల్లాలో పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోయారు. మహబూబ్నగర్ జిల్లా మెంటేపల్లి పోలింగ్ బూత్లోకి వనపర్తి మున్సిపల్ చైర్మన్ చొచ్చుకుపోయారు. దీంతో ఆయనపై కేసు పెట్టారు. కాంగ్రెస్, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణతో గంటసేపు పోలింగ్ నిలిచిపోయింది. మహబూబనగర్ జిల్లా చిట్లంకుంటలో దుండగులు బ్యాలెట్ బాక్స్లను విసిరేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అడమిల్లిలో దుండగులు పోలింగ్ బూత్లను ఆక్రమించారు. ఇదే జిల్లా చిన్నాయిగూడెం, పోలవరం గ్రామాల్లో ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా బోదేపల్లి పోలింగ్బూత్ వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు.
మహబూబ్నగర్ జిల్లా వెంకయ్యపల్లెలో పోలింగ్ సిబ్బందిపై కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. దీంతో పోలింగ్ నిలిపేశారు. గుంటూరు జిల్లాలో కనకమర్లపూడిలో బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోయారు. ఇదే జిల్లా కొండలరాయుడిపల్లెలో బ్యాలెట్ బాక్స్లను బావిలో పడేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కార్లపాలెంలో అధికారులే రిగ్గింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ ప్రతినిధి నుంచి కెమెరాను లాక్కున్నారు. పల్నాడులో ఒక గ్రామంలో మహిళలను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట మండలంలో హింస చెలరేగింది. వరంగల్, నెల్లూరు, తదితర జిల్లాల్లో గుర్తింపు కార్డుల సమస్య తలెత్తింది. దీంతో పలు చోట్ల ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఒక చోట ఘర్షణ చెలరేగింది. తెలుగుదేశం, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.