ఇసి ఆఫీసు ముందు టిడిపి ధర్నా, అరెస్టులు
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారంనాడు హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులకు, టిడిపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తెలుగుదేశం నాయకులు ఎన్నికల కమీషన్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయారు. దీంతో టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందని టిడిపి నాయకులు విమర్శించారు. ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలో మినహా మిగతా అన్ని జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల కమీషన్ కార్యదర్శి నారాయణ రావు అన్నారు. గుంటూరు జిల్లా ఇంకొర్రులో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం అందిందని ఆయన చెప్పారు.