ముగ్గురు మత్స్యకారుల మృతి: ఆరుగురు గల్లంతు
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం నుంచి చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒరిస్సాలోని పారదీప్ వద్ద పడవ సముద్రంలో మునిగిపోయింది. దాంతో పడవలోని ముగ్గురు మరణించగా, నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందినవారు. కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు వంద గ్రామాలు జలదిగ్బంధనమయ్యాయి. విజయనగరం జిల్లాలోని 32 గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి.
విజయనగరం జిల్లా కురుపాలెం, గుమ్మలక్ష్మీపురం, జీయమ్మవలస మండలాలకు రాకపోకలు ఆగపోయాయి. గ్రామాల ప్రజలను రక్షించడానికి విశాఖపట్నం నుంచి పడవలను తెప్పించారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు. విజయనగరం జిల్లాలో నాగావళి నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. దీంతో తోటపల్లి పాత వంతెన పిల్లర్లు బీటలు వారాయి. శ్రీకాకుళం జిల్లా రేగడి మండలంలో వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరదలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బీభత్స పరిస్థితి నెలకొంది. ఎకరాల కొలది పంటలు నాశనమయ్యాయి. వరద పరిస్థితిని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆరు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. వరద ప్రాంతాల్లో పడవలు, హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.