ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు: జలగండం
విశాఖపట్నం: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ఉత్తరాంధ్రలోని నాగావళి, వంశధార, జంఝావతి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒరిస్సాలోని పూరీకి సమీపంలో కేంద్రీవకృతమై వుంది. ఒరిస్సాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్రంలోని నదులు పొంగిపొర్లుతున్నాయి.
భారీ వర్షాలకు రోడ్లు జలమయం కావడంతో ఒరిస్సాకు, ఆంధ్రకు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. గత మూడు రోజులుగా కుస్తున్న వర్షాలకు ఒరిస్సాలోని రాయఘడ్లో కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. ట్రాక్ పూర్తిగా దెబ్బ తింది. దీంతో ఆ దారిన వెళ్లాల్సిన బొకారో, హిరాకుడ్, సమత, బిలాస్పూర్ - తిరుపతి రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి రాయఘడ్కు సహాయ బృందాలు వెళ్లాయి. విజయనగరం జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్కు గండి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.
కోటబొమ్మాళి మండలంలో గోడ కూలి ఒక బాలిక మృతి చెందింది. విజయనగరం జిల్లాలోని రెండు మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. విజయనగరం జిల్లాలోని 8 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరో మండలంలోని రెండు గ్రామాలు నీట మునిగాయి. శ్రీకాకళం జిల్లాలోని చంగుడి గ్రామం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దక్షిణ కోస్తా జిల్లాల్లో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెప్పారు. ఉత్తరాంధ్రలో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.